తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
– సాక్షి, అమరావతి
ఆత్మీయ కలయిక
కిర్లంపూడి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని కార్యాలయంలో ఆ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ఆయన పెద్ద సోదరుడు వీర రాఘవరావు (బాలు) బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ తండ్రి, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మరణం అనంతరం తొలిసారిగా జగన్ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశామని వారు తెలిపారు. తన తండ్రి అంతిమ యాత్రలో జగన్మోహన్రెడ్డి స్వయంగా పాల్గొని, పెద్ద కుమారుడిలా పాడె మోసి, తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. కష్ట సమయంలో తమ కుటుంబంపై ఎనలేని ఆప్యాయత చూపించి, తమలో ధైర్యం నింపిన అధినేత రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి ముద్రగడ పద్మనాభం నిబద్ధత, విశ్వసనీయత, వ్యక్తిత్వం, విలువలను రాజకీయ జీవితంలో పాటిస్తామని గిరిబాబు తెలిపారు. ఇక నుంచి నియోజకవర్గంలో పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.
29న ఎస్ఎంసీ ఎన్నికలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని 1,264 పాఠశాలల్లో ఈ నెల 29న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించనున్నారు. గత కమిటీలకు రెండేళ్ల కాలపరిమితి ముగియనుండటంతో తాజాగా మరో రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు నిర్వహించేందుకు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు నోటిఫికేషన్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18న పాఠశాలల్లో ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు. దీనిపై 25న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 29వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కమిటీ ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుంది. అనంతరం, 3 నుంచి 3.30 గంటల వరకూ తొలి సమావేశం నిర్వహిస్తారు. ప్రతి ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోనూ ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ఎస్ఎంసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిటీ ఏర్పాటుకు 50 శాతం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు హాజరు కావాలి. తల్లి, తండ్రి, సంరక్షకుల్లో ఒక్కరికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. చేతులెత్తే విధానం, నోటి మాటతో తెలపడం ద్వారా సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం రహస్య ఓటింగ్ విధానం అనుసరించవచ్చు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. చైర్మన్, వైస్చైర్మన్లలో ఒకరు బీసీ వర్గాలకు చెందినవారై ఉండాలి. వారిలో కనీసం ఒక మహిళ ఉండాలి. తహసీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, వీఆర్ఏలు పరిశీలకులుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ తోడ్పడాలని జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్ కోరారు.
ఘనంగా గణేశుని ఊరేగింపు
అయినవిల్లి: చవితి ఉత్సవాల్లో భాగంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారు మూషిక వాహనంపై బుధవారం మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల ఘోష నడుమ సాగిన ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన వేద పండితులు పంచహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.


