కాకినాడ రూరల్: రాజధాని ప్రాంతంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించడం ద్వారా అక్కడి ప్రజలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరాను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని అన్నారు. దీనిపై టెండర్లు ఆహ్వానించడం చూస్తూంటే.. ఇప్పటికే ఆ వ్యవస్థను ఎవరికో ధారాదత్తం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చంద్రబాబు నాలుగు దఫాల పాలనలో కీలక వ్యవస్థలను ప్రైవేటు పరం చేయడం ఆనవాయితీగా మా రిందని విమర్శించారు. తన అనుయాయులకు కాంట్రాక్టులకు అప్పగించేందుకు అన్ని దారులూ తెరిచే ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. డొమెస్టిక్, కమర్షియల్, ప్రభుత్వ రంగాలకు విద్యుత్ పంపిణీ ప్రైవేట్ సంస్థల ఆధీనంలో వెళితే ఎంతటి ఇబ్బంది ఉంటుందో గ్రహించాలని హితవు పలికారు. నెట్వర్క్ అభివృద్ధి, ఆపరేషన్స్, మెయింటెనెన్స్, గ్రిడ్ ఏర్పాట్లను కూడా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తే రాజధాని ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించే వారిపై భారం పడుతుందని, ఈ విధానం సరికాదని నాగమణి అన్నారు.


