
సూపర్ సిక్స్ పేరుతో మోసం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
● ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు
అంటే మోసం’ పుస్తకావిష్కరణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్తో పాటు 160కి పైగా హామీలిచ్చి ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై పార్టీ రూపొందించిన ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని కాకినాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన, ఇతర నేతలు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, కూటమి ఏడాది పాలలో అభివృద్ధి చేయకపోగా, వారు చేసిన మోసాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమేనని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారని, దీనికి సంబంధించిన వాస్తవాలు, ఆధారాలతో ఈ పుస్తకం రూపొందిందని చెప్పారు. మోసపు హామీలు, అబద్ధపు మాటలతో మభ్యపెట్టి రాష్ట్ర ప్రజలకు ఏవిధంగా వెన్నుపోటు పొడిచారో ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు. మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారని, దీనిలో చంద్రబాబు ఎన్ని మతలబులు పెడతారో వేచి చూడాలని అన్నారు. ఏ మెలికా పెట్టకుండా ఆయన ఏ ఒక్క పథకమూ అమలు చేయరని రాజా ఎద్దేవా చేశారు.
మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత మాట్లాడుతూ, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి, ఒక్కటి మాత్రమే ఇచ్చారని అన్నారు. గత ఏడాది ఇవ్వాల్సిన మరో రెండు సిలిండర్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామన్న హామీ కూడా అమలు చేయలేదన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీలను పక్కన పెట్టారన్నారు. గత ఏడాది ఎగ్గొట్టిన తల్లికి వందనం, రైతు భరోసా వంటివి కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల తరఫున పోరాడతామని చెప్పారు.
పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బంగారు భవిష్యత్తు వంటిదని, కూటమి, సీఎం చంద్రబాబు ఏడాది పాలనంతా చీకటి మయమని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసినట్లు ప్రభుత్వం అబద్ధం చెబుతోందన్నారు. ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తల్లికి వందనం పూర్తిగా ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పార్టీ అయ్యెరక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మాజీ మేయర్ సరోజ పాల్గొన్నారు.