
కళ్లు తెరవకుండానే.. కన్నుమూసిన పసికందు
ఫ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణమంటూ
కుటుంబ సభ్యుల ఆందోళన
ఫ ఇద్దరు నర్సుల సస్పెన్షన్
తాళ్లరేవు: కళ్లు కూడా తెరవకుండానే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి.. గర్భిణిని వైద్యులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోక పోవడంతో బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి పురిటి నొప్పులు రావడంతో భర్త రాము తాళ్లరేవు సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బిడ్డ మృతి చెందాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు మాధురికి పురిటి నొప్పులు వచ్చినప్పటికీ డ్యూటీలో ఉన్న వైద్యురాలు డి.స్నేహలత గాని, నర్సులు ఇందిర, శైలజ గాని పట్టించుకోకపోవడంతో స్వీపర్ అనంత డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే బిడ్డ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని, వైద్యురాలు స్నేహలత నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మద్దతు పలికారు.
ఆరు గంటలపాటు ఆందోళన
కాకినాడ – యానం రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, నైట్ డ్యూటీ డాక్టర్ స్నేహలతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ రహదారిలో సుమారు 6 గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జనం అధిక సంఖ్యలో రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్నేహలతను సస్పెన్షన్ చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని చెప్పడంతో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణకు సమాచారం ఇచ్చారు. పెదపూడి ఎస్సై తులసీరామ్, ఇంద్రపాలెం ఎస్సై వీరబాబుతోపాటు, ఏపీఎస్పీ బలగాలను రప్పించారు. ఇలా ఉండగా అధికార పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, వాడ్రేవు వీరబా బు, ధూళిపూడి బాబి, జక్కల ప్రసాద్ తదితరు లు ముమ్మిడివరం ఎమ్మె ల్యే దాట్ల సుబ్బరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించి కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ముగ్గురు వైద్యులు వినోద్కుమార్, సుజాత, సతీష్లతోకూడిన బృందంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి డ్యూటీలో ఉన్న నర్సులు ఇందిర, శైలజలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆర్డీఓ మల్లిబాబు ప్రకటించారు. అయితే వైద్యురాలు స్నేహలతపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమైపె చర్యలు తీసుకోవడం తమ పరిధిలో లేదని, జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేసినట్లు తెలిపారు.

కళ్లు తెరవకుండానే.. కన్నుమూసిన పసికందు

కళ్లు తెరవకుండానే.. కన్నుమూసిన పసికందు