లక్ష్యం నెరవేరితేనే ప్రయోజనం..
ఈ ఏడాది రూ.3,300 కోట్ల పంట రుణాలు
● వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా బ్యాంకులకు లక్ష్యాలు
● నడిగడ్డలో 80–90శాతం
సన్న, చిన్నకారు రైతులే
● సకాలంలో రుణాలు
అందిస్తేనే ప్రయోజనం
–8లో u
గద్వాలన్యూటౌన్: జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి పంటరుణ లక్ష్యం నిర్దేశమైంది. ఈఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. నడిగడ్డ రైతాంగం బ్యాంకులు అందించే రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా బోరుబావులను సైతం ఇక్కడి రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఇంకా పండ్ల తోటలు, కూరగాయలు పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రైతుభరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి పంట పెట్టుబడుల పథకాలను కేంద్ర, రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పటికీ.. వాటితో పూర్తి పంట పెట్టుబడుల అవసరాలు తీరడం లేదు. దీంతో రైతులంతా బ్యాంకులు అందించే పంట రుణాలతోనే పెట్టుబడులు పెడుతున్నారు.
2026–27 పంట రుణ లక్ష్యం ఇలా..
సీజన్ రైతులు రుణ లక్ష్యం (రూ.కోట్లలో)
వానాకాలం 84,000 1,980
యాసంగి 58,200 1,320
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. అయితే వర్షాలు కురుస్తాయని వందలాది రైతులు మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పత్తి, కంది తదితర పంటలు వేశారు. వర్షాలు లేక ఆ పంటలను తొలగించి.. వాటి స్థానంలో ఆరుతడి పంటలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తద్వారా రైతులు మరోసారి పెట్టుబడులు పెట్టాల్సిందే. అయితే జిల్లావ్యాప్తంగా 80 నుంచి 90శాతం మంది రైతులు సన్న, చిన్నకారు రైతులే. వీరంతా బ్యాంకు రుణాలపైనే ఆధారపడ్డారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. లేనిచో రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతారు. పంటలు బాగా రాకపోతే, రైతులు ప్రైవేటుగా తీసుకున్న అప్పులకు వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. నెలల తరబడి వడ్డీలు చెల్లిస్తూ ఆర్థికంగా బలహీన పడిపోయే పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు సకాలంలో రుణాలు అందించి, రైతులకు తోడ్పాటు అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది.


