ఆరోగ్యవంతమైన జీవితమే లక్ష్యం
గద్వాల: ఏ ప్రాంతంలోనైనా సంబంధిత శాఖలు తమ అవసరాల కోసం తవ్వకాలు జరిపే సమయంలో టెలికాం కేబుల్స్కు నష్టం వాటిల్లకుండా ముందస్తు సమాచారం ఇవ్వడమే సీబీయూడీ యాప్ ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఆయా శాఖల అధికారులు సిబ్బంది కనెక్టివిటీ సమన్వయంపై దృష్టిపెట్టడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రతి త్రైమాసికం టెలికాం కమిటీ సమావేశం నిర్వహించాలని, టెలికాం సేవలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుదల, ఆయా విభాగాల మధ్య సమన్వయం ప్రధానమన్నారు. టెలీ కమ్యూనికేషన్ చట్టం ప్రకారం టెలికాం నెట్వర్క్కు నష్టం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులు వెంటనే సమస్యను పరిష్కరించి నివేదిక అందించాలని చెప్పారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. భారత్ నెట్ ప్రగతిని సమీక్షిస్తూ చాలా పంచాయతీలకు కనెక్టివిటీ అందుబాటులో ఉందన్నారు. ముఖ్యంగా ఆశావాహ బ్లాక్గా గుర్తించిన గట్టు మండలంలోని మిగిలిన గ్రామాలకు తక్షణం కనెక్టివిటీ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సురక్షితమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి ఒకే విధమైన లీజు వ్యవస్థపై ఆలోచించాల్సి ఉందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఏఓ భూపాల్రెడ్డి, బీఎస్ఎన్ఎల్ డీఈ లక్ష్మీకాంత్, టీఫైబర్ జోనల్ మేనేజర్ ఈశ్వర్, జిల్లా మేనేజర్ వేణు తదితరులు పాల్గొన్నారు.
గద్వాల క్రైం: ఆరోగ్యవంతమైన జీవితమే అందరి లక్ష్యం కావాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య వారోత్సవాల నేపథ్యంలో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి మెడికల్, నర్సింగ్ కళాశాల విద్యార్థులచే ర్యాలీని కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిఒక్కరు వ్యాయమం, యోగా, స్విమ్మింగ్ తదితర వాటిని క్రమం తప్పకుండా చేయాలన్నారు. వివిధ గ్రామాల నుంచి వైద్యసేవల కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మనిషికి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే వ్యర్థం అన్నారు. కార్యాక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.


