–8లో u
గద్వాల: జిల్లావ్యాప్తంగా శనివారం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. రంజాన్ను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంతి, సామరస్యాలకు ప్రతీక రంజాన్ పండుగ అన్నారు. రంజాన్ పరస్పర గౌరవం, సేవాభావం, దానగుణాన్ని పెంపొందించే పవిత్ర మాసమన్నారు. హిందువులు, ముస్లింలు సహా అన్ని మతాల ప్రజలు కలసిమెలసి సఖ్యతతో జీవించాలని, సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యతతో మెలగాలన్నారు. అదేవిధంగా ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


