● రేపటి నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ
● జిల్లాల్లో మొత్తం 1,69,299 మంది రైతులు
గద్వాల: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుభరోసా రూ.18 వేల కోట్ల నిధులు కేటాయింపులు చేసింది. దీంతో యాసంగిలో రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసా డబ్బులు ఆదివారం నుంచి వారి బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. జిల్లాలో మొత్తం 1,69,299 మంది రైతులు ఉన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు పాస్బుక్కులు పొందిన వారు మరో 6 వేల మంది రైతులకు సైతం రైతుభరోసా అందుకునేందుకు అర్హత పొందారు. మొత్తం జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3,52,821 ఎకరాలు ఉంది. కాగా మొదటి విడతలో ఎకరం భూమి ఉన్న 1,64,546 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుభరోసా అందనుంది.
1,69,299 రైతులు.. 3,52,400 ఎకరాలు
జిల్లావ్యాప్తంగా మొత్తం 1,69,299 మంది రైతులు ఉండగా.. జిల్లావ్యాప్తంగా 3,52,400 ఎకరాల భూమి ఉంది. వీరిలో తొలి విడతలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కింద అందజేయనున్నారు. గత ఖరీఫ్ సీజన్లో రైతుభరోసా కింద మొత్తం 1,69,299 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.268.84కోట్లు పెట్టుబడి సాయం కింద వారి ఖాతాలో జమచేశారు. రబీలో కొత్తగా మరో 6 వేల మంది రైతులు పాస్బుక్కులు పొందగా వారికి కూడా ఈసారి రైతుభరోసా అందనుంది. అంటే 1.75 లక్షలకుపైగా రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుభరోసా అందనుంది.
అర్హులందరికీ అందిస్తాం..
రైతుభరోసా పథకం కింద ఆదివారం నుంచి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున అందించనుంది. వ్యవసాయ సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పాస్బుక్కులు పొందిన వారికి సైతం రైతుభరోసా వస్తుంది. కొత్త పాసుబుక్కులు పొందిన రైతులు ఏఈఓలకు వివరాలు అందిస్తే వారికి రైతుభరోసా లభిస్తుంది.
– సక్రియానాయక్, ఏడీఏ


