
ఆధునిక హంగులు
పీయూలో కొత్త పుంతలు తొక్కుతున్న పరిపాలన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఆటుపోట్లను దాటుకుంటూ.. ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పీయూలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమర్థ్ స్కీం పోర్టల్ ద్వారా సిబ్బందికి ఆన్లైన్ అటెండెన్స్, వర్క్లోడ్, పే స్లిప్ల వంటివి అందిస్తున్నారు. వీటితోపాటు పీయూలో వినియోగిస్తున్న నీటి పునర్వినియోగం కోసం నూతనంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ను ఆదా చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యం అవుతున్నారు.
సమర్థ్ పోర్టల్తో సేవలు..
పీయూలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి సెలవుల మంజూరు, వేతనాల పే స్లిప్లు, విద్యార్థి అడ్మిషన్, అటెండెన్స్, స్కిల్స్ తదితర అంశాలను పొందుపర్చుకోవడం, వివిధ కార్యక్రమాలు, హాస్పిటల్స్ తదితర అంశాలను మ్యానువల్ పద్ధతిలో జరిగేవి. దీనిని ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చి సమగ్రంగా యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పీఎం ఉషా స్కీం నిధులను అందిస్తున్న ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థకు కేంద్రం సమర్థ్ పోర్టల్ను ఉచితంగా అందిస్తుంది. ఈ స్కీంలో భాగంగా యూనివర్సిటీ సిబ్బందికి ప్రత్యేకంగా సమర్థ్ యాప్ ద్వారా ప్రత్యేక సేవలను అందించేందుకు అధికారులు ఇటీవల ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో రెగ్యులర్ అధ్యాపకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగా.. కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలను ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థులనూ ఇందులో చేర్చనున్నారు. తద్వారా పీయూకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఈ–పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫైలింగ్ నిర్వహించి.. ఫైల్ స్టేటస్ ఎక్కడ.. ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
టాప్లో నిలబెడతాం..
పీయూనూ తెలంగాణలో టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. ఫైల్స్, సిబ్బంది అటెండెన్స్, విద్యార్థుల తదితర వివరాలు అన్ని సమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోకి తీసుకొస్తున్నాం. డ్రెయినేజీ నీరు వృథా పోకుండా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి.. నీటి పుర్వినియోగం, బయో ఫర్టిలైజర్స్ వినియోగంలోకి తీసుకువస్తాం. సోలార్ ప్యా నెల్స్ ద్వారా కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.
– జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్
పేపర్ లెస్ సేవలు..
యూనివర్సిటీలో పేపర్ లెస్ సేవలు నిర్వహించేందుకు సమర్థ్ పోర్టల్ను వినియోగిస్తున్నాం. దీని ద్వారా టీచింగ్, నాన్టీచింగ్, స్టూడెంట్స్ అందరికీ కూడా సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. వీలైనంత త్వరగా దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తాం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో యూనివర్సిటీలో నీటి కొరత తీరడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి.
– రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్
ఆన్లైన్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల వివరాలు
విద్యుదుత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ బిగింపు
రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు
నీటి పునర్వినియోగం, వ్యర్థాలతో బయో ఫర్టిలైజర్స్ తయారీ

ఆధునిక హంగులు

ఆధునిక హంగులు