
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
అలంపూర్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అధికారులను ఆదేశించారు. కర్నూల్లోని నివాసంలో వారు ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇంట్రా, వాటర్ గ్రిడ్ అధికారులతో మంగళవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు జీవనదులైన కృష్ణా, తుంగభద్ర నదుల్లో ప్రస్తుతం నీటి నిల్వలపై ఆరా తీశారు. నదుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కు చేరుకునే సమయంలో కలుషితమయ్యే అవకాశం ఉందని, నీటి నిల్వలు అడుగంటిన సమయాల్లో ఫిల్టరైజేషన్ సరిగ్గా నిర్వహించాలని సూచించారు. వేసవిలో నీటి నిల్వలు తగ్గిన సమయాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సాధారణ సమయంలో తాగునీటి కష్టాలు పడే గ్రామాల్లో వేసవిలో మరింత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అలాంటి గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు నీటిని అందించాలని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని అధికారులను సూచించారు. సమావేశంలో అధికారులు వెంకటరమణ, శ్రీధర్ రెడ్డి, పరమేశ్వరి, డీఈలు, ఏఈలు తదితరులు ఉన్నారు.