భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంస్థ 2026–27 సంవత్సరపు ముసాయిదా బడ్జెట్ను మంగళవారం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టారు. అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చైర్మన్ బుర్ర కొమురయ్య, కమిషనర్ ఉదయ్కుమార్ సమక్షంలో కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అంచనా బడ్జెట్ రూ.100.87కోట్లు నిర్ణయించి ప్రకటించారు. సాధారణ ఆదాయం రూ.11.32కోట్ల 50 వేలు, గ్రాంట్ల నిధుల ఆదాయం రూ.88.28కోట్లుగా నిర్ణయించారు. ఏప్రిల్ 1, 2026 నాటికి మిగులు బడ్జెట్ కింద ప్రారంభ విలువ రూ.7కోట్ల 1లక్ష 99వేలు చూపించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ గతేడాది రూ.31.17కోట్ల 64 వేలుగా అంచనా వేయగా, మార్చి 31నాటికి అయిన ఖర్చు రూ.21.04కోట్ల 64వేలుగా వివరించారు.
ఆదాయం రూ.11.32కోట్లు
మున్సిపల్ పన్నులు, ఇతరత్రాల రూపంలో రూ.11,32కోట్ల 50వేల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో పన్నుల రూపంలో రూ.7.74 కోట్లు, కేటాయించిన ఆదాయాలు అద్దె ద్వారా రూ.51.50లక్షలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య విభాగం రశీదుల ద్వారా రూ.68లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం రశీదుల ద్వారా రూ.1.92కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.46.50లక్షలు, మొత్తం రూ.50.37 కోట్ల ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. వీటితో పాటు కాపిటల్ ఫండ్ (సీపీఎస్) నాన్ ప్లాన్ నిధులు రూ.88,28 కోట్లు, డిపాజిట్లు రుణాలు రూ.1.26కోట్లు మొత్తంగా పన్ను వనరులు, కాపిటల్ ఫండ్ నిధులన్ని కలిపి రూ.10.087కోట్ల బడ్జెట్గా అంచనా వేశారు. వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ వ్యయం, ఇంజినీరింగ్ విభాగాల నిర్వహణ, సాధారణ పరిపాలన, పట్టణ ప్రణాళిక విభాగం, వసతులు, వార్డులవారీగా నాన్ప్లాన్, ప్రణాళిక, ఇతర నిధుల ఖర్చు అంచనా వేశారు.
ఆదాయ వనరులు పెంచాలి..
మున్సిపల్ అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులు సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదాయ వనరులపై పాలకవర్గ సభ్యులు దృష్టిసారించాలన్నారు. పట్టణంలో వనరులను సృష్టించుకోవడం వలన అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సవరించాలని అధికారులకు, వచ్చే సమావేశంలో సభలో చర్చించాలని కౌన్సిలర్లకు సూచించారు. శానిటేషన్ విభాగానికి నిధులు పెంచాలని, వినియోగంలోని సులబ్ కాంప్లెక్స్లకు నిధులు ఎందుకు కేటాయించారని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు.


