ఇక జోరు ప్రచారం
అసలు ప్రచారం షురూ..
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం
భూపాలపల్లి: నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఎన్నికల బరిలో రెబల్స్ లేకుండా చేయడంలో అన్ని పార్టీలు సఫలీకృతమయ్యాయి. టికెట్ ఆశించిన వారిని బుజ్జగించి, మరో పార్టీ వైపు మొగ్గు చూపకుండా చూసుకొని అన్ని రాజకీయ పార్టీలు తమ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో నేటినుంచి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది.
బరిలో 107 మంది..
భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా నామినేషన్ల స్క్రూటినీ అనంతరం 166 మంది బరిలో నిలిచారు. ఇందులో 59 మంది మంగళవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 107 మంది పోటీలో ఉన్నట్లుగా మున్సిపల్ కమిషనర్ జోన ప్రకటించారు.
నో రెబల్స్..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మద్ధతు లభించని వారు ఎక్కువ సంఖ్యలో రెబల్స్గా బరిలోకి దిగారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల మద్ధతుదారుల గెలుపుపై ప్రభావం పడింది. దీంతో ఈసారి అలా జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మందస్తుగా ప్రణాళికతో సాగాయి. టికెట్ ఆశించిన వారిలో గెలుపు గుర్రాలు, ఆర్థికంగా ఉన్న వారిని గుర్తించి, మిగిలిన వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని నేతలు హామీలు ఇచ్చారు. దీంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ఇబ్బందులు తప్పాయి. బీ ఫారాలు దక్కని ఒకరిద్దరు అసంతృప్తితో ఉన్నా, వారిని కూడా బుజ్జగిస్తున్నారు.
ఏ పార్టీ ఎన్ని వార్డుల్లో పోటీ..
మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంతో కలిసి అభ్యర్థులను పోటీలో ఉంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఎస్పీ 1 వార్డు స్థానంలో, బీజేపీ 25, సీపీఐ 4, సీపీఎం 1, కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 30, టీఆర్పీ 5, డీఎస్పీ 2, జనసేన 3, ఏఐఎఫ్బీ 1 వార్డులో, స్వతంత్రులు పది మంది పోటీలో ఉన్నారు.
రెండు వార్డుల్లో ఆరుగురు పోటీలో..
మున్సిపాలిటీలోని అత్యధిక వార్డుల్లో ముగ్గురు, నలుగురు అభ్యర్థులే పోటీలో ఉన్నారు. 7వ, 28వ వార్డుల్లో మాత్రమే అధికంగా ఆరుగురు చొప్పున పోటీ పడుతుండగా 26, 30 వార్డుల్లో ఇద్దరు చొప్పున పోటీలో ఉన్నారు. 2, 4, 6, 8, 11, 12, 14, 15, 17, 18, 19, 20, 21, 24, 25 వార్డుల్లో ముగ్గురు చొప్పున, 1, 3, 5, 10, 13, 16, 22, 23, 27 వార్డుల్లో నలుగురు చొప్పున, 9, 29వ వార్డుల్లో ఐదుగురు చొప్పున బరిలో ఉన్నారు.
నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వరకు పార్టీల నేతలు ఆశావహులకు బీ ఫారాలు అందించకపోవడంతో కొందరు డైలమాలో పడ్డారు. టికెట్ వస్తుందో.. రాదోనని ఆందోళన చెందారు. చివరకు అన్ని పార్టీలు ఒకే రోజు అభ్యర్థులను ప్రకటించడం, స్వతంత్రులకు గుర్తులు కేటాయించడంతో అసలు ప్రచారం నేటితో ప్రారంభం కానుంది. బరిలో ఉన్న వారంతా గెలుపు కోసం మంగళవారం రాత్రి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచారం రథాలకు అనుమతులు, కాలనీల్లో పెద్ద మనుషులను కలవడం, ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తంగా నేటి నుంచి భూపాలపల్లి పట్టణంలో ప్రచారం పర్వం జోరుగా సాగబోతుంది.
మున్సిపల్ బరిలో 107 మంది అభ్యర్థులు
రెబల్స్ లేకుండా చేయడంలో అన్ని పార్టీలు సఫలం
అధిక వార్డుల్లో పోటీలో ముగ్గురు, నలుగురు అభ్యర్థులే
నేటినుంచి హోరెత్తనున్న ప్రచార పర్వం
ఇక జోరు ప్రచారం
ఇక జోరు ప్రచారం


