ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల నిర్వహణ
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా స్థానిక అంబేడ్కర్ క్రీడా మైదానంలోని మినీ ఫంక్షన్ హాల్ను, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్ల కోసం గదులను పరిశీలించారు. అంబేడ్కర్ స్టేడియంలో టెంట్లు ఏర్పాటు చేసి, వార్డు వారీగా డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సామగ్రి సమగ్రంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచేందుకు స్టేడియంలోని గదులలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్లో గాలి, వెలుతురు లేకుండా కిటికీలు, వెంటిలేటర్లను పూర్తిగా మూసివేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం మినీ ఫంక్షన్ హాల్లో వార్డు వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి, బారికేడింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ జోన తదితరులు పాల్గొన్నారు.
ఆహార కల్తీ కట్టడికి చర్యలు..
జిల్లాలో ఆహార కల్తీని కట్టడి చేసి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆహార తనిఖీ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆహార తనిఖీశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, వైద్య, విద్యా, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆహార భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆహార తనిఖీ అధికారి వరుణ్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి..
జిల్లాలోని 2బీహెచ్కే గృహ సముదాయాల్లో లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు తదితర శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2 బీహెచ్కే కాలనీల్లో అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా, డ్రెయినేజీ, విద్యుత్ సదుపాయాలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి..
ఉద్యోగులు విరమణ పొందిన అనంతరం తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ)గా పనిచేసి జనవరి 31న ఉద్యోగ విరమణ పొందిన బాబురావుకు మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు పాల్గొని బాబూరావును శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ


