
ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాసం
భూపాలపల్లి అర్బన్: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పుల్లూరిరామయ్యపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు హిమబిందు తన కూతురు ప్రహర్షిని అదే పాఠశాలల్లో ప్రీ ప్రైమరీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రషీద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ రమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శానిటేషన్, మెప్మా ఆర్పీలకు వైద్య పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: పురపాలక సంఘ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శానిటేషన్ సిబ్బంది, మెప్మా ఆర్పీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ వైద్యాధికారులతో కలిసి వైద్యశిబిరం ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఈ అన్నపూర్ణ వైద్య పరీక్షలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాఽధికారులు డాక్టర్ రోహిణి, డాక్టర్ స్వాతి, వైద్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సమగ్ర కులగణన
సాహసోపేత నిర్ణయం
కాటారం: దేశంలో సమగ్ర కులగణన బిల్లును అమల్లోకి తీసుకురావడానికి ప్రధాన మంత్రి మోదీ చేస్తున్న కృషి సాహసోపేతమైందని కులగణన సాధన సమితి జాతీయ కన్వీనర్, బీసీ నాయకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. శుక్రవారం కాటారం వచ్చిన ఆయనను అఖిల భారత పద్మశాలి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎలుబాక సుజాత ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా బీసీ లెక్కలు తేల్చాలనే ఏకై క డిమాండ్తో ప్రధాన మంత్రికి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, డిల్లీ వరకు ప్రత్యక్షంగా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, రుషికేశ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కాళేశ్వరం బస్టాండ్లో
షీ, మాతాశిశు కేంద్రం
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్లో షీ రూమ్ (సానిటరీ హైజిన్ ఎంపవర్మెంట్), మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే మహిళలు, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షీ, మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాల మేరకు శుక్రవారం కాళేశ్వరంలోని శాశ్వత బస్టాండ్కు మార్చినట్లు కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం వచ్చే మహిళలకు బస్టాండ్లో షీ, మాతా శిశు కేంద్రం రూములు అందుబాటులో ఉంటాయని తెలిపారు. షీ రూమును, బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాన్ని పాలిచ్చే తల్లులు వినియోగించుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాసం