
విద్యార్థుల పరిశుభ్రతపై దృష్టి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు విద్యతో పాటు పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి సూచించారు. జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఒకరోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అధ్యక్షతన కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు. విద్యను ప్రథమ ప్రాధాన్యతగా ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. దేశ భవిష్యత్ను నిర్ణయించడంలో విద్య కీలకపాత్ర వహిస్తుందన్నారు. విద్యార్థులకు పరిశుభ్రత, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించాలని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మధ్యాహ్నం భోజనం నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యకరమైన పిల్లలే రేపటి దేశ భవిష్యత్ను నిర్ణయిస్తారని.. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విద్యా సంవత్సరం జిల్లావ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో మొదటి ఐదుగురు విద్యార్థులకు ప్రత్యేక బహుమతి ఇస్తానని హమీఇచ్చారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులను శ్రద్ధతో చదివించి వందశాతం ఫలితాలు రాబట్టడానికి కృషి చేయాలన్నారు. రేపటినుంచి ప్రారంభం కానున్న ఈ విద్యా సంవత్సరం పండగ వాతావరణంలో ప్రధానోపాధ్యాయులు గ్రామంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యావంతులను పాఠశాలకు ఆహ్వానించాలన్నారు. విద్య ఆవశ్యకతను వివరించి ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఅర్డినేటర్లు రమేష్, లక్ష్మణ్, దుప్పటి రాజగోపాల్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి