● గ్రామీణ మహిళలకు సర్కారు కొత్త కానుక
● 62 ఎరువుల దుకాణాలను వర్చువల్గా ప్రారంభించిన
విప్ ఐలయ్య
జనగామ: మహిళల ఆర్థిక స్వావలంబనకు జిల్లా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 62 ఎరువుల దుకాణాలు ప్రారంభించారు. మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడంతో పాటు రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో మహిళా సాధికారతకు కొత్త ఊపునిచ్చింది. మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరితో కలిసి కలెక్టరేట్ ఆవరణ నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వర్చువల్ విధానంలో దుకాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఎరువుల దుకాణాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులుగా నిలుస్తాయని తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. మహిళా సంఘా లకు వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయం పెరగడంతో పాటు నాయకత్వ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రారంభమైన 62 ఎరువుల దుకాణాలు మహిళా సంఘాల ఆర్థిక పురోగతికి దోహదపడటంతో పాటు గ్రామీణ మహిళల అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుస్తాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టులో అవతరణ దినోత్సవం
జనగామ రూరల్: జిల్లా కోర్టులో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.శశి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండా దయాకర్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజయ్య, న్యాయవాదులు కర్ర యల్లారెడ్డి, కూరెల్ల శ్రీనివాస్రెడ్డి, మంచాల రవీందర్, వెంకటనరసయ్య, శ్రీహరి, ఆలె బాలరాజ్, శ్రీహరి, పవన్, జి.పి. సంధ్యారాణి, పీపీ శ్రీనివాస్, ఏజీపీ చెరుకు చంద్రశేఖర్, రేణుక, దయామణి, సునీతారాణి పాల్గొన్నారు.


