సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రైల్వే రంగంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధి గణనీయంగా మారనుండగా.. ఉమ్మడి వరంగల్లో రైల్వే డివిజన్ ఏర్పాటు హామీగానే మిగలనుంది.
అన్నీ ఉన్నా.. డివిజన్ లేదు..
కాజీపేటను డివిజన్గా ఏర్పాటు చేయడానికి అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్ లోకోషెడ్, రెండు పిట్లైన్లు, భారీ రైల్వేయార్డు, కోచ్ నిర్వహణ కేంద్రం, కొత్తగా నిర్మిస్తున్న మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఇంటర్సిటీ కోచ్ తయారీ యూనిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాలతో కొత్త డివిజన్లు ఏర్పాటవుతున్నా అన్ని అర్హతలు ఉన్నా కాజీపేటకు మాత్రం డివిజన్ ప్రకటించకపోవడం ఉమ్మడి వరంగల్ వాసుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
డివిజన్ వస్తే కొత్తమార్గాలు..
ఉమ్మడి వరంగల్ (కాజీపేట)కు డివిజన్ వస్తే కాజీపేట–బల్లార్షా, కాజీపేట–మోటుమర్రి, పెద్దపల్లి–నిజామాబాద్, డోర్నకల్–మణుగూరు, డోర్నకల్–భద్రాచలం రోడ్–సత్తుపల్లి మార్గాలు చేరే అవకాశం ఉంది. దాదాపు 695 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ డివిజన్లో సింగరేణి బొగ్గు రవాణా కూడా ఉండడంతో ప్రారంభం నుంచే లాభాల్లో నడిచే అవకాశముందని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రైల్వే పరిపాలన అంతా సికింద్రాబాద్ కేంద్రంగానే కొనసాగుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటైన జంక్షన్.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలకు వెళ్లే రైళ్లకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కాజీపేటను డివిజన్ చేస్తే ఉమ్మడి వరంగల్ కొత్త గుర్తింపు రానుంది.
ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి..
రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ లభించిన నేపథ్యంలో కాజీపేట డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్కు డివిజన్ వల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల మంజూరు, సరుకు రవాణా ఆదాయం పెరగనుంది. వరంగల్ను రైల్వే పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉండనుండగా, పరిశ్రమలు, వ్యాపారాలకు ప్రోత్సాహం తద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఊతం ఇవ్వనుందని నిపుణులు చెబుతున్నారు.
1980 నుంచే ఉద్యమం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. 1980 నుంచి వివిధ దశల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాజీపేట జంక్షన్ దేశంలోనే అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటిగా ఎదిగినప్పటికీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే కొనసాగుతోంది. కాగా, విశాఖపట్నం జోన్ ప్రతిపాదన నేపథ్యంలో ఈ ఏడాదిలో డివిజన్ కోసం ఉద్యమాలు జరిగాయి. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వస్తున్న సందర్భంగా కాజీపేట డివిజన్ కోసం ఉద్యోగ, ప్రజాసంఘాలు మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది.
రాజకీయ లబ్ధి కోసమే
సౌత్ కోస్టల్ రైల్వే
రాజకీయల లబ్ధి కోసమే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో రైల్వే కార్మికులకు ఎలాంటి లాభం లేదు. విడిపోతున్న సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు రైల్వే బోర్డు పరిష్కరించాలి.
–పిల్లలమర్రి రవీందర్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ
కాజీపేటను డివిజన్గా చేయాలి..
నాందేడ్, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లతో దక్షిణ మధ్య రైల్వే జోన్గా, విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖపట్టణం డివిజన్లతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్లుగా విడిపోతున్నాయి. సౌత్ కోస్టల్ రైల్వేజోన్ ఏర్పాటును తెలంగాణ ఎప్పుడు వ్యతిరేకించలేదు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కాజీపేట డివిజన్ చేసి, కాజీపేట, నాందేడ్, హైదరాబాద్, సికింద్రాబాద్తో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి.
–దేవులపల్లి రాఘవేందర్, రైల్వే జేఏసీ కన్వీనర్


