● వ్యక్తికి తీవ్రగాయాలు
పాలకుర్తి టౌన్: నడిరోడ్డుపై ఓ వ్యక్తిని విచక్షణరహితంగా కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా జరిగింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శాతాపురం గ్రామానికి చెందిన తీగల ధర్మారావు స్టేషన్ ఘన్పూర్లో మినీ బ్యాంకు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పాలకుర్తిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. రోజువారీలాగానే పనులు ముగించుకొని పాలకుర్తికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి బస్టాండ్ సమీపంలో ఇంటి ముందు నిలుచొని ఉండగా ఓ కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దారికాచి అకస్మాతుగా కత్తితో కడుపు, వీపు, చేతిపై విచక్షణా రహితంగా పొడిచాడు. ధర్మారావు ప్రతిఘటించడంతో దుండగుడు అదే కారులో పారిపోయాడు. ఎడమ చేతిపై కత్తిని పొడిచి వదిలివెళ్లాడు. తీవ్ర రక్తస్రావంతో కారును కొద్ది దూరం ధర్మారావు వెంబడించాడు. దీంతో ఒక చోట ధర్మారావు కుప్పకూలాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఽతీవ్రంగా గాయపడిన ధర్మారావును హుటాహుటినా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు 108లో తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఽమధ్య ఇల్లు, భూ తగాదాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు.


