బచ్చన్నపేట: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మండలంలోని లింగంపల్లికి చెందిన జగన్ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్ బుధవారం తాడిపత్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని సైకిల్ యాత్ర చేశానని, 9 నెలల నుంచి మోకాళ్లపై 100 దేవాలయాల మెట్లు ఎక్కి మొక్కులు చెల్లించానని అన్నారు. అలాగే, చర్చిల్లో ప్రార్థన, మసీదుల్లో నమాజ్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 10,100 కొబ్బరికాయలు కొట్టానని, భద్రాచలం నుంచి విజయవాడకు పాదయాత్రగా చేరుకుని జగన్మోహన్రెడ్డికి వివరించానని చెప్పారు. తనపై ఉన్న అభిమానంతో నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఇకమీదట అన్నివిధాలా అండగా ఉంటానని చెప్పినట్లు ప్రవీణ్ తెలిపారు.
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
నర్మెట: మండల కేంద్రంలోని పలు ప్రదేశాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ సహకారంతో ఉప సర్పంచ్ కొలెపాక స్వామి మజ్జిగ ప్యాకెట్లను బుధవారం ఊరచెరువులో పని చేస్తున్న కూలీలకు పంపిణీ చేశారు.
విరిగిన చెట్ల తొలగింపు
బచ్చన్నపేట: మండల కేంద్రంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కాగా, విషయం తెలుసుకున్న సర్పంచ్ అల్వాల నర్సింగారావు జేసీబీలతో ఆ చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చెట్లను తొలగించినట్లు తెలిపారు.
భూసార పరీక్షలు తప్పనిసరి
జనగామ రూరల్: రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి విజయ్రెడ్డి అన్నారు. బుధవారం గానుగపహడ్, కోర్రతండాలో ఇఫ్కో ఆధ్వర్యంలో భూసార పరీక్షలు నిర్వహించారు. రైతులు పాల్గొన్నారు.


