జఫర్గఢ్: మండల కేంద్రంలో పడమర కొండపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏటా నిర్వహించే ఉత్సవాలు ఈ సారి కూడా ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు మూడ రోజుల పాటు స్వామి వారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మొదటిరోజు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కొండపైన స్వామివారి ఆలయంలో 81 కళశాలతో అభిషేకం నిర్వహించనున్నారు. ఈ పూజ కార్యక్రమాల అనంతరం మిగతా రెండు రోజులు కొండ దిగువన ఉన్న సీతారామచంద్ర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. చివరి రోజున స్వామి వారి కల్యాణమహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు పొడిచేటి వెంకటాచార్యులు తెలిపారు. స్వామి వారి జయంతి ఉత్సవాల్లో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయంవంతం చేయాలని ఆయన కోరారు.


