హైకోర్టు న్యాయవాది సాధిక్‌ అలీ దీక్ష | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయవాది సాధిక్‌ అలీ దీక్ష

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

జనగామ: పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది ఎండీ సాధిక్‌ అలీ మంగళవారం తన ఇంట్లో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆమరణ దీక్షకు సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్‌, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్‌, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, బీఆర్‌ఎస్‌ పట్టణ నాయకులు ఎండీ సాజిద్‌ కమర్‌, యాకూబ్‌ పాషా, సల్మాన్‌ హామీర్‌ మద్దతు ప్రకటించారు. అనంతరం సాధిక్‌ అలీ మాట్లాడుతూ.. కలెక్టర్‌కు వ్యతిరేకంగా కత్తుల రాజిరెడ్డి కేసును హైకోర్టులో వాదించడంతో తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారన్నారు. కలెక్టర్‌ బాధితులకు రక్షణ కమిటీని ఏర్పాటు చేసి, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీల దృష్టికి తీసుకుపోవడంతో తనపై నిషేధాజ్ఞలు విధించారన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ కమిషనర్‌ సిబ్బందితో వచ్చి తన ఇంటిని కొలతలు వేసి, తేడా ఉన్నాయని ఇల్లును కూల్చివేస్తామని చెప్పినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని సాధిక్‌ అలీ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement