ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

హసన్‌పర్తి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. సోమవారం కమిషనరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను సీపీకి వివరించారు. ఈసందర్భంగా సీపీ వివిధ పోలీస్‌స్టేషన్‌ అధికారులకు ఫోన్‌ద్వారా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహించాన్నారు. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కేసు పురోగతి, భూ సమస్యలు సీపీ దృష్టికి వచ్చాయి. కమిషనరేట్‌ పరిధిలో ఆసాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా 87126 65257 నంబర్‌కు వాట్సాప్‌ద్వారా తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఆర్డీఓ కార్యాలయ

ప్రజావాణిలో 15 దరఖాస్తులు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఆర్డీఓ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీఓ కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజావాణి ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

చౌరస్తాలో నాకాబందీ

జనగామ రూరల్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు పట్టణంలోని చౌరస్తాలో సోమవారం నాకాబందీ కార్యక్రమాన్ని డీసీపీ రాజామహేంద్ర నాయక్‌, సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టి, అనుమానాస్పద వ్యక్తులు, పత్రాలు లేని వాహనాలు, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్ర మ రవాణా నియంత్రణ, నిషేధిత వస్తువుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ తెలిపారు.

తక్కువ ఖర్చుతో

పోషకాహారం అందించాలి

జనగామ రూరల్‌: తక్కువ ఖర్చుతో స్థానికంగా లభించే పోషకాహార పదార్థాలను అందించాలని అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ సూచించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సోమవారం పట్టణంలోని కల్లెం రోడ్డులో గల మార్కండేయ కమ్యూనిటీ హాల్‌లో జిల్లా స్థాయి పోషకాహార ప్రదర్శన ఆరోగ్యకరమైన వంటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో జనగామ సీడీపీఓ మణెమ్మ, కొడకండ్ల సీడీపీఓ విజయ చంద్రిక, సూపర్‌వైజర్స్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

నిందితులను శిక్షించాలి

జనగామ రూరల్‌: న్యాయవాది ఖాజా మహిముద్దీన్‌ను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండ దయాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హత్యకు నిరసనగా సోమవారం జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అనంతరం మౌనం పాటించి మృతుడికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు మెతుకు జాన్‌ రెడ్డి, తాళ్లపల్లి రాజయ్య, మన్నె సత్తయ్య, రామకృష్ణ, లక్ష్మణ స్వామి, సుధాకర్‌, శ్రీహరి, మంచాల రవీందర్‌, జి.రవీందర్‌, పవన్‌, రాజశేఖర్‌, తిరిగి అశోక్‌, మధుసూదన్‌, శ్రీనివాస్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement