జనగామ రూరల్: మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణ పనులకు వర్చువల్ విధానంలో బటన్ నొక్కి శంకుస్థాపన చేశారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా అధికారులు, జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 8 వేల మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేయడం సంచలనాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. వర్చువల్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహిళా భవనాలకు వర్చువల్గా సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన


