జనగామ: నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఇంటి నిర్మాణానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో వెలుగు దొరికింది. పట్టణంలోని వికాస్నగర్కు చెందిన ఆర్టీసీ కండక్టర్ సతీష్ 2022లో ప్రారంభించిన ఇంటి నిర్మాణం వివిధ సమస్యలతో మధ్యలో ఆగిపోయి కుటుంబానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలుమార్లు గ్రీవెన్స్లో వినతులు సమర్పించినప్పటికీ పరిష్కారం లభించలేదు. అయితే ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి గ్రీవెన్స్లో సతీష్ తన ఇబ్బందులను కలెక్టర్ వివరించగా, వెంటనే స్పందించి సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి వీధిలోని కందకాలను పూడ్చి, వీధి దీపాలను ఏర్పాటు చేయగా, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి మూడు విద్యుత్ స్తంభాలు అమర్చి ఇంటికి విద్యుత్ కనెక్షన్ కల్పించారు. సమస్యలు పరిష్కారం కావడంతో సతీష్ కుటుంబంలో ఆనందం నెలకొంది. ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం రాలేదు, కానీ ప్రస్తుత కలెక్టర్ స్పందనతో తమ ఇంటికి వెలుగు వచ్చిందని సతీష్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో గ్రీవెన్స్ ద్వారా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయనే దానికి ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది.
గ్రీవెన్స్లో వినతి..కలెక్టర్ చొరవ
ఆనందంలో ఆర్టీసీ కండక్టర్ కుటుంబం


