● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఓపీఎంఎస్లో తప్పనిసరిగా నమోదు చేయాలని, సజావుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 20,953 రైతుల నుంచి 1,21,063 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, అందులో ఇప్పటికే 1,14,484 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించారని అలాగే 17,180 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 211 కోట్లు జమ చేశామన్నారు. డీఆర్డీఓ భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలి..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం కావాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2 వరకు వెయ్యి ఇళ్లు ప్రవేశానికి సిద్ధం చేయాలన్నారు. పీడీ మాతృనాయక్, జెడ్పీ సీఈఓ రంగారావు, డీఈలు, ఎంపీడీఓలు, ఏఈలు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం
అక్రిడిటేషన్ కార్డులు
జిల్లాలో 2026–2028 సంవత్సరానికి సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియపై అక్రిడిటేషన్ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన జర్నలిస్టులకే కార్డులు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో డీపీఆర్ఓ బండి పల్లవి, డీఎం ఆర్టీసీ స్వాతి, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఇ.మల్లారెడ్డి, ఎస్.భిక్షపతి, యు.నరేందర్, కె.కిరణ్ కుమార్, వి.మధు, జాల రమేశ్, యు.మహేష్, నీల నరేష్బాబు, అబిద్ ఫైసల్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.


