● ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి
జనగామ: జనగామ పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని హన్మకొండ రోడ్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ స్కీం లేక్ రీ–జనరేషన్ (చెరువుల పునరుద్ధరణ) పథకంలో భాగంగా రూ.92లక్షలతో చేపట్టిన చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, ఏఎంసీ చైర్పర్సన్ బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణతో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణ అనేది కేవలం అభివృద్ధి పనులు మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే బాధ్యతగా భావించాలని తెలిపారు. అంతకు ముందు 38 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు.
పరిశీలన.. పరామర్శలు
అనంతరం పట్టణంలోని చిన్నమోరీ అండర్ బ్రిడ్జ్ వద్ద కాలువ ఏర్పాటు పనుల కోసం ఎంపీ రోడ్డు విస్తరణకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పలు అభివృద్ధి అంశాలపై చర్చించి, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్కు గురై చికిత్స పొందుతున్న టీపీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్రెడ్డిని, మరిగడిలో కమలాకర్ అనే వ్యక్తిని పరామర్శించా రు. డీసీసీ అధ్యక్షురాలి ఆహ్వానం మేరకు పలువురు బీఆర్ఎస్ యువకులు కాంగ్రెస్లో చేరారు.


