● సబ్స్టేషన్ లేకుండా పంప్హౌజ్ ఎలా పనిచేస్తుంది?
● అధికారులు, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే కడియం
చిల్పూరు: జూలై 31 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్–1 పనులు పూర్తిచేసి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులోని గండి రామారం ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్–1 పంప్హౌస్ నిర్మాణ పనులను మంగళవారం అధికారులు, కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నామమాత్రంగా జరగుతున్న పనులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సబ్స్టేషన్ లేకుండా పంప్హౌజ్ ఎలా పనిచేస్తుందని నీటిని ఎలా లిఫ్ట్ చేస్తారని, పంప్హౌజ్ పనులు మొదలు పెట్టినప్పుడే సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టాలని తెలియదా? అని అధికారులను ప్రశ్నించా రు. జూలై 31 వరకు పూర్తిచేసి ఈ వర్షాకాలంలోనే చిల్పూరు, వేలేరు మండలాల రైతులకు సాగు నీరు అందించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, రైతులు పాల్గొన్నారు.
కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండొద్దు..
లిఫ్ట్ పనులను పరిశీలిస్తూ హన్మకొండకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజవరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతులను సమస్యలను అడిగి తెలుసుకోగా మిల్లుల్లో ఖాళీ లేవని ధాన్యం తీసుకోవడానికి యజమానులు నిరాకరిస్తున్నారన్నారు. దీంతో వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి మిల్లర్లతో సమస్యలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మిల్లుల రీ–ట్యాగింగ్ చేసి వీలైనంత తొందర్లో సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు.


