పరామర్శ
నర్మెట (తరిగొప్పుల): సోలీపురానికి చెందిన రాంచరణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన విదితమే.. కాగా, ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలైన ప్రియాన్షి (3) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
ఆర్థికసాయం
చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన పోలు జగన్నాథం మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, బాధిత కుటుంబానికి శ్రీ మార్కండేయ పద్మశాలీ పరపతి సంఘం సభ్యులు పరామర్శించి సంఘం తరఫున రూ. 25 వేల సాయం అందజేశారు. సంఘం అధ్యక్షుడు గజ్జెల దామోదర్, పేరాల పెద్ధ కుమారస్వామి, రాజన్బాబు, సుధాకర్, నాగభూషణం, కాంతయ్య, వెంకటేశ్వర్లు, వెంకటయ్య పాల్గొన్నారు.
పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలి
పాలకుర్తి టౌన్: నియోజవర్గ కేంద్రంలోని ప్రభ్వు ఆస్పత్రిలో నిర్మించిన పోస్టుమార్టం గదిని వెంటనే ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సీపీఎం(ఎంఎల్)లిబరేషన్ మండల కార్యదర్శి కొనుకటి కళింగరాజు డిమాండ్ చేశారు. మంంగళవారం పార్టీ నాయకులతో కలిసి పోస్టుమార్టం గదిని ఆయన పరిశీలించి మాట్లాడారు. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన భవనం చిన్నచిన్న కారణాలతో ఉపయోగింలోకి రాకవపోడం దురదృష్టకరమన్నారు. ఆనతరం ఆస్పత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అపర్ణను కలిసి సమస్యలపై చర్చించారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకుడు సాంబయ్య, సోమయ్య, సారయ్య, శ్రీనివాస్, ఆర్వైఎల్ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నిక
బచ్చన్నపేట: ఆలింపూర్ గ్రామానికి చెందిన దాసారం శ్రీనివాస్ను తెలంగాణ శాలివాహన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర శాలివాహన సంఘం నియమించింది. ఈ మేరకు మంగళవారం శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు మోహన్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం శాలివాహన కులస్తులను ఆదుకోవాలని కోరారు.
సిద్ధేశ్వరాలయంలో 23న వేలం
బచ్చన్నపేట: కొడవటూర్ గ్రామంలో స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో పలు హక్కులకు ఈనెల 23వ తేదీన వేలం పాటలను నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ టెంకాయలు, పూజా సామగ్రి విక్రయించేందుకు రూ. 2లక్షలు, లడ్డూ, పులిహోర తయారీ, విక్రయించేందుకు రూ. 50 వేలు, తలనీలాలు పోగు చేసుకునేందుకు రూ. 1.50 లక్షలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు రూ. 50 వేల డీడీలను తీసి సీల్డ్ కవర్లను అందజేయాలన్నారు. వేలం పాటల కాల పరిమితి ఏడాది కాలం ఉంటుందని, ఆసక్తి గల వారు వేలంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు సీల్డ్ కవర్లను టెండరు బాక్స్లో వేసిన వారే వేలంలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తిగలవారు ఆలయ ఆవరణలో నిర్వహించే వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు.
ఉపసర్పంచ్ల చెక్ పవర్ తొలగిస్తే ఉద్యమమే
కొడకండ్ల: గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్లుకు ఉన్న ఉమ్మడి చెక్ పవర్ను తొలగించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకొకపోతే ఉద్యమిస్తామని మండల ఉపసర్పంచ్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీఓ బర్మావత్ శంకర్కు ఉపసర్పంచ్లు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు షన్నా, వెంకటయ్య, రంగయ్య, యాకూబ్పాషా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పథకానికి ప్రాధాన్యం
జఫర్గఢ్: కేంద్రప్రభుత్వం ఉపాధి పథకానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కూనూర్ గ్రామంలో ఉపాధి పనులను వెంకటేశ్వర్లు పార్టీ బృందంతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కూలీలో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకం ద్వారా ఎంతో మంది కూలీలు ఉపాధి పొందుతున్నారన్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్గౌడ్ తదితరులు ఉన్నారు.
బంజారా నాయకుల ముందస్తు అరెస్ట్
పాలకుర్తి టౌన్: బంజారా జాతీ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న కార్యక్రమాన్నికి బయలు దేరిన ఎల్హెచ్పీఎస్ నాయకులను మంగళవారం పోలీసులు ముందస్తూ అరెస్టు చేశారు. శాంతియుతంగా సీఎం నివాస ముట్టడికి వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్దమని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగరాజు నాయక్ అన్నారు.


