● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: వ్యాయమంతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఓర్పు, సహనం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం యువజన, క్రీడల వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ధర్మకంచ స్టేడియం వరకు 2కే రన్ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఆర్డీఓ గోపిరామ్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు,యువత, క్రీడాకారులు, వాకర్స్ పాల్గొన్నారు.
రెడ్క్రాస్ సేవలు పెరగాలి
రెడ్క్రాస్ సొసైటీ సేవలు విస్తరించేందుకు సభ్యుల సంఖ్య పెంచాలని కలెక్టర్, రెడ్క్రాస్ సొసైటీ జనగామ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగామ రెడ్క్రాస్ సొసైటీ ఉదయం ఏర్పాటు చేసిన కొత్త సభ్యుల చేర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ డి.లవకుమార్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున రావు, కార్యదర్శి కన్న పరశురాములు, సభ్యులు పాల్గొన్నారు.
కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి
మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని ఓపీఎంఎస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు తప్పని సరిగా నమోదు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అలాగే ప్రభుత్వ సౌజన్యంతో, రెడ్ క్రాస్ సొసైటీ జనగామ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు.
పర్యాటకశాఖ కార్యాచరణ ప్రణాళికలో యువ టూరిజం క్లబ్స్ కార్యచరణ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.


