వెల్గటూర్: పార్టీ కార్యక్రమాలకు అప్పు చేసి.. బలవన్మరణానికి పాల్పడిన బీఆర్ఎస్ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగన్ కుటుంబాన్ని మంత్రి సోమవారం పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రూ.50వేలు ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో జగన్ భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, పిల్లల చదువు విషయంలోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మంత్రికి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
పేదల పక్షపాతిగా ప్రభుత్వం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన చింతకుంట రాజనర్సయ్య ఇటీవల విద్యుత్షాక్తో మరణించగా.. ఆయన కుటుంబాని కి విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ.50 వేల చెక్కు, రూ.4.50 లక్షల బాండ్ను ఆయన భార్య లక్ష్మీకి అందించారు. బుడిగజంగాల కాలనీకి చెంది న సిరిగిరి ఎల్లవ్వ విద్యుత్షాక్తో మృతిచెందగా ఆమె భర్త వెంకటయ్యకు రూ.50 వేల చెక్కు, రూ. 4.50 లక్షల బాండ్ను అందించారు. నిరుపేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, కో–ఆప్షన్ సభ్యులు గట్టు సతీశ్, కౌన్సిలర్ తిరుమలయ్య, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, బాలముకుందం, రవీందర్రెడ్డి, రౌతు గంగాధర్, ములాసపు మహేశ్, లైశెట్టి విజయ్ పాల్గొన్నారు.


