వెల్గటూర్: వరి కొయ్యలు కాల్చడం వల్ల పర్యావరణం, భూసారానికి నష్టం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో రైతులు వరి కొయ్యలు కాల్చడం వల్ల 50 ఎకరాల్లో మంటలు వ్యాపించిన విషయమై శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల భూమిలో ఉన్న వానపాములు, జీవ ఎరువులను అందించె క్రిమి కీటకాలు అంతమవుతున్నాయని తెలిపారు. వరికొయ్యలు నేలలో కలియదున్నితే సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరుగుతాయన్నారు. దుక్కి దున్నే సమయంలో సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయని, దీంతో డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుందని అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, రైతులు పాల్గొన్నారు.


