మీడియాపై వీసీ చిందులు | - | Sakshi
Sakshi News home page

మీడియాపై వీసీ చిందులు

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

మీడియాపై వీసీ చిందులు

చర్యలు తీసుకోవాలి

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: శాతవాహన యూనివర్సిటీలో అర్బన్‌ నక్సలైట్లు ఉన్నారంటూ రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. ఒకవైపు పోలీసులు అలాంటి వ్యక్తులు ఎవరూ లేరని ప్రకటనలు జారీ చేస్తున్నా.. కొందరు మాత్రం ఈ ప్రచారాన్ని ఆపడం లేదు. ప్రొఫెసర్‌ సుజాత, వైస్‌ చాన్స్‌లర్‌ వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇందులో భాగంగా సోమవారం వర్సిటీలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలను కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియాపై వీసీ చిందులు తొక్కడం, పోలీసులతో బెదిరించేందుకు యత్నించడం, విద్యార్థులపై కేసులు పెడతా అంటూ హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు, ఆడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వర్సిటీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సాయంత్రానికి యూనివర్సిటీ విద్యార్థులు సీపీ గౌస్‌ ఆలం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం విశేషం.

మీడియాపై వీసీ చిందులు

శాతవాహన గాథల పేరుతో ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ‘కొలువులమ్మా.. కొలువులు’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. అర్బన్‌ నక్సలైట్లు, కొలువుల విక్రయాలపై వార్తలను కవర్‌ చేసేందుకు సోమవారం ‘సాక్షి’ టీవీతోపాటు, ఇతర ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు శాతవాహన వర్సిటీకి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వైస్‌ చాన్స్‌లర్‌ ఉమేశ్‌కుమార్‌ వారిపై చిందులు తొక్కారు. అసలు మీరెవరు? మిమ్మల్ని ఎవరు లోనికి రానిచ్చారు? ఎవరి అనుమతి తీసుకున్నారు? అని వాగ్వాదానికి దిగారు. దీనికి మీడియా ప్రతినిధులు దీటుగానే స్పందించారు. యూనివర్సిటీ పౌరుల ఆస్తి అని, ఇక్కడకు వచ్చేందుకు తాము ఎవరినీ అనుమతి కోరనవసరం లేదని బదులిచ్చారు. ఈ లోపు వీసీ ఎప్పటిలాగే కొత్తపల్లి పోలీసులను క్యాంపస్‌లోకి దింపి మీడియాను నియంత్రించేందుకు విఫలయత్నం చేశారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌

సీసీ కెమెరాల ద్వారా క్యాంపస్‌ను పర్యవేక్షిస్తూ.. తనకు అనుమానం వచ్చిన ప్రతీ విద్యార్థిని తన ఛాంబర్‌కి పిలిపించుకుని కేసులు పెడతామంటూ వీసీ హెచ్చరించే వారని విద్యార్థులు తొలి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా వీసీ ఉమేశ్‌కుమార్‌ పలువురు విద్యార్థులను తన ఛాంబర్‌కి పిలిపించి కేసులు పెట్టి లోపలేస్తానంటూ మాట్లాడిన వీడియోలు, ఆడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవే ఆడియోలు, వీడియోలను త్వరలోనే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కూడా వర్సిటీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమర్పించనున్నారు. అదే విధంగా బాధితులు తమను అర్బన్‌ నక్సలైట్లంటూ చిత్రీకరిస్తున్న వారిపై జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నారు. శాతవాహన వర్సిటీలో ఎలాంటి అర్బన్‌ నక్సలైట్లు లేరని స్పష్టం చేస్తూ ప్రకటన జారీచేసిన కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం చిత్రపటానికి విద్యార్థులు వర్సిటీ ప్రధానద్వారం ఎదుట క్షీరాభిషేకం చేయడం విశేషం.

కరీంనగర్‌సిటీ: తమపై తప్పుడు ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాతవాహన విద్యార్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీ గౌస్‌ఆలం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. 10 రోజుల నుంచి విద్యార్థులు, పలువురు ప్రొఫెసర్లపై వస్తున్న ఆరోపణలపై సీపీ స్పందించి వర్సిటీలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగడం లేదని తెలుపడంతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. పోలీస్‌శాఖ ఇప్పటికే విచారణ చేసి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అశోక్‌, రోహిత్‌, మహేశ్‌, లక్ష్మణ్‌సాయి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement