మెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డగోలుగా జరగుతున్నాయి. ఆదివారం ఉదయాన్నే వాగులోకి భారీగా వచ్చిన ట్రాక్టర్లు పెద్ద ఎత్తున్న ఇసుకను తరలించాయి. ఒక్కసారిగా 50కి పైగా ట్రాక్టర్లు రాగా, ట్రిప్పునకు రూ.1,000 చొప్పున వీడీసీ వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఇసుక అక్రమ రవాణా విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆదివారం పెద్దాపూర్ మల్లన్న జాతర ఉందని అధికార యంత్రాంగం అక్కడే ఉండిపోతుందని భావించిన వీడీసీ సభ్యులు ముందుగానే ఇసుక వ్యాపారులకు ఫోన్ చేసి ఇసుక తీస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇసుక కోసం భారీగా ట్రాక్టర్లు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆ ప్రాంతానికి సిబ్బందిని పంపించారు. ఇది గమనించిన ఇసుక వ్యాపారులు కొందరు అక్కడి నుంచి జారుకోగా, నాలుగు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. కాగా, ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆత్మకూర్ వీడీసీ అధ్యక్షుడి ఓ ఆడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.


