అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. క్యూబాపై ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నుంచి అమెరికా సైన్యం తిరిగి వచ్చే దారిలోనే ఈ ఆపరేషన్ ముగియవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఫ్లోరిడాలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నాం. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటాం. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలోనే మా సైన్యం ఆ పని చేయబోతోంది. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను ఆ దేశానికి 100 గజాల దూరంలో ఆపుతాం. మేం లొంగిపోతున్నాం అని క్యూబా చెప్పేలా చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారాయన.
అమెరికా–క్యూబా మధ్య వైరం కొత్తది కాదు. 19వ శతాబ్దం నుంచే ప్రారంభమై.. ఫిడెల్ కాస్ట్రో విప్లవం తర్వాత మరింత తీవ్రమైంది. అమెరికా వ్యాపార ప్రయోజనాలు, కమ్యూనిస్టు సిద్ధాంతం, సోవియట్ యూనియన్తో క్యూబా స్నేహం.. ఇవన్నీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణమయ్యాయి. అయితే..
ఆ మధ్యలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. అయితే ట్రంప్ రాకతో ఆ పరిస్థితి మారిపోయింది. ట్రంప్ తాజా ప్రకటన ఇరు దేశాల మధ్య వైరం మరింత పెంచేలా కనిపిస్తోంది.
వెనెజువెలా అధ్యక్షుడు మదురోను సైనిక చర్య ద్వారా అమెరికా బంధించిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనే ట్రంప్ ‘క్యూబా నెక్ట్స్..’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అదొక ఒక విఫల దేశం. దాని దగ్గర డబ్బు లేదు.. చమురు లేదు. కానీ అదో అందమైన ద్వీపం. దానిని స్వాధీనం చేసుకోవడం నాకు గౌరవం’’ అని వ్యాఖ్యానించారు.
అది జరగదు..
ఇప్పటికే అమెరికా తీవ్ర ఆంక్షలతో క్యూబా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చమురు దిగుమతులపై బ్లాకేడ్ కారణంగా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అలాగే.. విద్యుత్ కోతలు, నీటి కొరత, ఔషధాల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ట్రంప్ తాజా అల్టిమేటంపై క్యూబా స్పందించింది. ‘‘క్యూబా ఓ స్వతంత్ర దేశం. అలాంటప్పుడు అమెరికా మాకు ఆదేశాలివ్వడం ఏంటి?. నేను లొంగిపోను.. రాజీనామా చేయను. మా నాయకత్వాన్ని నిర్ణయించేది ఇక్కడి ప్రజలే’’ అని అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ ప్రకటించారు.


