యూఏఈపై ఇరాన్ మరోసారి (మార్చి 17) దాడికి దిగింది. 10 బాలిస్టిక్ మిసైళ్లు, 45 డ్రోన్లతో అటాక్ చేసింది. అయితే ఈ దాడిని యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఈ విషయాన్ని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
దేశ సార్వభౌమత్వం మరియు భద్రతకు ముప్పు కలిగించే ఈ తరహా దాడులను సైన్యం అత్యంత అప్రమత్తతతో ఎదుర్కొంటున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి తమ రక్షణ వ్యవస్థలు 314 బాలిస్టిక్ మిసైళ్లు, 15 క్రూయిజ్ మిసైళ్లు, 1672 డ్రోన్లు నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గర్వంగా పేర్కొంది.
కాగా, ఇప్పటివరకు జరిగిన రక్షణ చర్యలలో యూఏఈ ఇద్దరు అధికారుల ప్రాణాలు కోల్పోయింది. అదనంగా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాలస్తీనా దేశాలకు చెందిన ఆరుగురు సాధారణ పౌరులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 157 మంది గాయపడ్డారు.
అపశృతి
ఇరాన్ జరిపిన మిసైల్, డ్రోన్ దాడిని తిప్పికొడుతుండగా అబుదాబిలోని బనియాస్ నివాస ప్రాంతంలో అపశృతి చోటు చేసుకుంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ధ్వంసం చేస్తుండగా శకలాలు కిందపడి, ఓ పాకిస్తానీ జాతీయుడు మృతి చెందినట్లు యూఏఈ వర్గాలు తెలిపాయి. ఘర్షణనలు ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈలో నమోదైన ఎనిమిదవ మరణం ఇది.


