ఇక నో హార్మూజ్‌.. భారత్‌కు గుడ్‌న్యూస్‌ | UAE can now send more oil via Fujairah by passing Hormuz to India | Sakshi
Sakshi News home page

Fujairah.. ఇక నో హార్మూజ్‌.. భారత్‌కు గుడ్‌న్యూస్‌

Apr 30 2026 10:56 AM | Updated on Apr 30 2026 11:02 AM

UAE can now send more oil via Fujairah by passing Hormuz to India

ఇరాన్‌, అమెరికా యుద్ధం వేళ చమురు విషయంలో భారత్‌కు శుభవార్త. చమురు ఉత్పత్తి, తరలింపు విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని బైపాస్ చేసి, ఫుజైరా(Fujairah) ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది భారత్ లాంటి అతిపెద్ద చమురు మార్కెట్‌కు మంచి పరిణామం. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు. దీంతో భారత్ చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.

యూఏఈ రెండు రోజుల క్రితమే.. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) బయటకు వచ్చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మే ఒకటో తేదీ నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఈ నేపథ్యంలో యూఏఈ అవసరాలు, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఇరాన్‌ హార్మూజ్‌ అవసరం లేకుండా.. బైపాస్ చేసి, ఫుజైరా ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు వెల్లడించింది.

ఇక, యూఏఈ ఒపెక్‌ నుంచి బయటకు రావడంతో తన చమురు ఉత్పత్తిని రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు. ఒపెక్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్‌ను ఎగుమతి చేయవచ్చు. దీంతో భారత్ కష్టాలకు చెక్ పడొచ్చు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్‌కు యూఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చమురు.. భారీ సంఖ్యలో భారత్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు.

ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్ ఇలా.. 
హబ్షాన్-ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ (ADCOP) అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవు వరకు 380-406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్‌లైన్‌ను, ఇరుకైన హార్మూజ్‌ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారుగా 4 బిలియన్ డాలర్ల వ్యయంతో 2012లో ఈ పైప్ లైన్‌ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయవచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని, ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్మూజ్‌ జలసంధి అవసరం లేకుండా పోతుంది.

ఫుజైరా నుంచి భారత్‌కు ఆయిల్ సరఫరా గణాంకాలు..

  • యూఏఈ సరఫరా (ఏప్రిల్ 2026): రోజుకు 619,000 బ్యారెల్స్

  • గత ఆర్థిక సంవత్సర సగటు: రోజుకు 433,000 బ్యారెల్స్

  • వృద్ధి: సుమారు 43% పెరుగుదల

  • భారత్ మొత్తం క్రూడ్ దిగుమతి (ఏప్రిల్ 1–26, 2026): రోజుకు 4.4 మిలియన్ బ్యారెల్స్ (ఫిబ్రవరి 5.2 మిలియన్ బ్యారెల్స్‌తో పోలిస్తే 15% తక్కువ)


భారత్‌లో ఇంధన ధరలపై ప్రభావం

  • హార్మూజ్‌లో ఉద్రిక్తతల కారణంగా సరఫరా మార్గాలు కష్టతరంగా ఉన్నప్పటికీ, ఫుజైరా పైప్‌లైన్ వల్ల భారత్‌కు స్థిరమైన సరఫరా లభిస్తోంది.

  • ఇది ధరల పెరుగుదల ఒత్తిడిని తగ్గిస్తోంది.

  • యూఏఈ ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్/రోజు చేరుతుంది.

  • ఒపెక్‌ పరిమితులు లేకుండా యూఏఈ ఎక్కువగా ఉత్పత్తి చేయగలదు. దీని వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది.

  • దీంతో, భారత్‌కు దిగుమతి బిల్లు తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం.. ఇంధన ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement