పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ సంభాషణలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం చేరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ట్రంప్, మస్క్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. అమెరికా అధ్యక్షుడిపై మస్క్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన చమురు సంక్షోభం, హర్మూజ్ జలసంధి తదితర అంశాలపై అమెరికా, భారత్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి ఫోన్ సంభాషణ జరిగింది. అయితే ఆ కాల్లో మస్క్ చేరినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న వేళ ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన కీలక సంభాషణలో ఎటువంటి అధికారిక హోదా లేని వ్యక్తి పాల్గొనడం ఏంటని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంత బిలియనీర్ అయితే ఇటువంటి పని చేయడం ఏంటని పలువురు వ్యతిరేకిస్తున్నారు. అయితే మస్క్ను ఎందుకు చేర్చారు. ఈ చర్చలో ఆయన ఏమైనా మాట్లాడారా అనే పూర్తి వివరాలు తెలియరాలేదు.
కాగా సున్నితమైన జాతీయ భద్రతా అంశాలు చర్చించబడే దేశాధినేతల కాల్స్లో ప్రైవేట్ పౌరులను చేర్చుకోవడం చాలా అరుదని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ అంశంపై వైట్ హౌస్ కానీ భారత అధికారులు గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ట్రంప్, మస్క్ మధ్య విభేదాల తర్వాత ప్రస్తుతం సంబంధాలు మెరుగు పడి ఉండవచ్చని అందుకోసమే మస్క్ ఈ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి ఉండవచ్చని న్యూయార్క్ కథనం పేర్కొంది.


