తండ్రీకొడుకుల పనే | Shocking Twist in Bondi Beach Incident | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకుల పనే

Dec 15 2025 7:52 AM | Updated on Dec 16 2025 3:57 AM

Shocking Twist in Bondi Beach Incident

సిడ్నీ కాల్పుల ఉదంతంలో ప్రధాన నిందితులను పాక్‌ జాతీయులుగా గుర్తించిన పోలీసులు

50 ఏళ్ల నిందితుడిని సాజిద్‌ అక్రమ్‌గా గుర్తించిన పోలీసులు

నవీద్‌కు ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రసంస్థతో సత్సంబంధాలు

వెలుగులోకి విస్మయకర విషయాలు

సిడ్నీ: ప్రశాంత ఆస్ట్రేలియాలో రక్తపుటేరులు పారించింది పాక్‌ జాతీయులైన తండ్రీకొడుకులని తేలింది. ఇద్దరు సాయుధులు ఆదివారం సిడ్నీలోని బాండీ బీచ్‌ను ఆనుకుని ఉన్న చిన్న పార్క్‌లో వేడుకల్లో మునిగిపోయిన యూదులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించి 15 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని ఆదివారమే నవీద్‌ అక్రమ్‌గా గుర్తించగా మరో ఆగంతకుడు నవీద్‌ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్‌ అక్రమ్‌ అని న్యూ సౌత్‌వేల్స్‌ పోలీసులు సోమవారం వెల్లడించారు. 

సాజిద్‌ను పోలీసులు ఆదివారం ఘటనాస్థలిలోనే అంతంచేయగా నవీద్‌కు బుల్లెట్‌ గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించి ప్రశ్నిస్తున్నామని న్యూ సౌత్‌వేల్స్‌ పోలీస్‌ కమిషనర్‌ మాల్‌ లాన్యన్‌ చెప్పారు. సోదాల్లో నవీద్‌కు చెందిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ జెర్సీ ధరించినట్లుగా కార్డ్‌పై ఫొటోలో కన్పిస్తోంది. కార్డ్‌ ప్రకారం నవీద్‌ ఆస్ట్రేలియాలోనే 2001 ఆగస్ట్‌ 12న జన్మించారు. 

దీంతో నవీద్‌కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. తండ్రి సాజిద్‌ విద్యార్థి వీసాతో పాకిస్తాన్‌ నుంచి 1998లో ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లో ఆ వీసాను పార్ట్‌నర్‌ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత దానిని ‘రెసిడెంట్‌ రిటర్న్‌’ వీసాగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి టోనీ బుర్కీ సోమవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన వీసా గడువు ముగిసేలోపే ఆస్ట్రేలియాను వీడినా లేదా ఆస్ట్రేలియాకు ఆవల ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిన పక్షంలో అలాంటి వాళ్లకు తిరిగి ఆస్ట్రేలి యాలోకి అడుగుపెట్టాక  ‘రెసిడెంట్‌ రిటర్న్‌’ వీసా జారీచేస్తారు. ఆ వీసాతో ప్రస్తుతం సాజిద్‌ ఆస్ట్రేలియాలో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలి యాకు వచ్చిన ఇన్నేళ్లలో సాజిద్‌ మూడు సార్లు మాత్రమే దేశం దాటాడు. 

గతంలో నిఘా పరిధిలో ఉన్నా..
యువ నవీద్‌పై గతంలో కొన్ని నెలలపాటు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి. ఐఎస్‌ఐఎస్‌ అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 2019 అక్టోబర్‌లో తొలిసారిగా నవీద్‌పై ఆస్ట్రేలియా నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఉగ్రవాదంతో సంబంధమున్న ఇద్దరికీ జైలుశిక్ష పడింది. వీళ్లతో నవీద్‌కు సంబంధం ఉన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. దీంతో ఇతను సైతం ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా లేదా అని తెల్సుకునేందుకు 2019 ఏడాదిలో దాదాపు ఆరునెలలపాటు అతని కదలికలపై ఆస్ట్రేలియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ ఆర్గనైజేషన్‌(ఏఎస్‌ఐవో) అధికారులు నిఘా పెట్టారు. 

అయితే తనపై నిఘా ఉందని ముందే పసిగట్టిన నవీద్‌ ఏళ్ల తరబడి ఎలాంటి ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా మంచివాడిలా నటించాడు. దీంతో వేర్పాటువాద లక్షణాలు, ప్రవర్తన ఇతడిలో లేవని భావించి నవీద్‌ను నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకోలేదు. అదను చూసి ఆదివారం ఇలా దుశ్చర్యకు పాల్పడటంతో ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థలో లోటుపాట్లపై మరోసారి సమీక్ష అవసరమనే వాదనలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం నవీద్‌ను మేస్త్రీ పని నుంచి ఒక సంస్థ తొలగించింది. ఆ సంస్థ ఇటీవల దివాలా తీయడంతో వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా నవీద్‌ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement