
నామినేట్ చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ఆశలు మళ్లీ చిగురించాయి. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం నార్వేకు సిఫార్సుచేసింది. ఈ మేరకు నామినేట్ చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తమ నాయకుడు నోబెల్ అవార్డ్కు తగిన వ్యక్తి అని అమెరికా కాంగ్రెస్లో ప్రతినిధుల సభ సభ్యుడు, జార్జియా నుంచి రిపబ్లికన్ పార్టీ నేత బడ్డీ కార్టర్ వ్యాఖ్యానించారు.
ఈయన సైతం ట్రంప్ పేరును నామినేట్ చేస్తూ నార్వేలోని శాంతి బహుమతి కమిటీకి లేఖ రాశారు. ‘‘ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఒంటిచేత్తో ఆపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇరాన్ అణుబాంబును సాధించకుండా ట్రంప్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అసాధ్యమని అంతా భావించిన వేళ ట్రంప్ దానిని సాధించి చూపించారు. సమర సంక్షోభం సమసిపోయేలా ఎంతో సమర్థవంతంగా వ్యవహరించిన ట్రంప్ ఈసారి నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు.
శాంతిస్థాపన, యుద్ధ విరమణ, అంతర్జాతీయ సామరస్యాల సాధనకు కృషిచేసినందుకు ట్రంప్ నోబెల్ ఇవ్వాల్సిందే’’అని బడ్డీ కార్టర్ తన లేఖలో రాశారు. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర సైనిక చర్యలు ఆపడంలో ట్రంప్ సఫలీకృతులయ్యారు. దౌత్య జోక్యం ద్వారా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారు. ఈ విషయంలో ట్రంప్ నిజంగా శాంతికాముకుడు’’అని పాకిస్తాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అయితే గతంలో ట్రంప్ను నామినేట్ చేస్తూ లేఖ రాసిన ఉక్రెయిన్ విదేశీవ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఒలెగ్జాండర్ మరెజ్కో తన ట్రంప్ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.