టెహ్రాన్కు చేరుకున్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించడమే లక్ష్యంగా పాకిస్తాన్ తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకున్నారు. అమెరికాతో శాంతి ఒప్పందం దిశగా ఇరాన్ను ఒప్పించడానికి ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి.
మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఆయన కొనగిస్తున్నారని తెలిపాయి. టెహ్రాన్ ఎయిర్పోర్టులో అసిమ్ మునిర్కు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మొమెనీ స్వాగతం పలికారు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ బుధవారమే ఇరాన్కు చేరుకున్నారు. అసిమ్ మునిర్ ఇరాన్ ముఖ్య నాయకులతో భేటీ కాబోతున్నారు.
అబ్బాస్ అరాగ్చీతో నఖ్వీ భేటీ
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ శుక్రవారం సమావేశమయ్యారు. వారిద్దరూ భేటీ కావడం గత 24 గంటల వ్యవధిలో ఇది రెండోసారి. అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చేసిన ప్రతిపాదనలను వారు సమీక్షించారు. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య విభేదాలను తొలగిండమే ధ్యేయంగా నఖ్వీ ఇరాన్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా కీలక నేతలతో సమావేశమయ్యారు.


