పాకిస్తాన్‌లో టెన్షన్‌.. పీఎం షరీఫ్‌ సంచలన నిర్ణయం! | Pak PM Shehbaz Sharif called National Command Authority meeting | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో టెన్షన్‌.. పీఎం షరీఫ్‌ సంచలన నిర్ణయం!

May 10 2025 1:11 PM | Updated on May 10 2025 2:49 PM

Pak PM Shehbaz Sharif called National Command Authority meeting

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాక్‌ ఆర్మీ దాడులను భారత దళాలు తిప్పి కొడుతున్నాయి. పాక్‌ చర్యలకు చెక్‌ పెడుతూ భారత్‌ అలర్ట్‌గా ఉంది. భారత్‌ దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ పాకిస్తాన్‌ ప్రధాని చర్యలు సంచలనంగా మారాయి. న్యూక్లియర్‌ బాంబ్‌ను పర్యవేక్షించే అథారిటీతో పాక్‌ ప్రధాని సమావేశం కావడం పలు అనుమానాలను తావిస్తోంది.

ప్రస్తుతం భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతూ పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్‌ మ్యూనిషన్‌, ఫైటర్‌ జెట్లను వాడి.. భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. సామాన్య పౌరుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతోంది. అయితే వాటిని భారత్‌ తిప్పికొట్టింది. భారత సైన్యం తమ దాడులను తిప్పికొడుతుండటంతో.. ఇక లాభం లేదని పాకిస్తాన్‌ ఏకంగా అణుబాంబును రెడీ చేస్తున్నట్లు అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. అందుకు కారణం తాజాగా పాక్‌ ప్రధాని షహెబాజ్‌ షరీఫ్‌ నిర్వహించిన ఓ మీటింగ్‌. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ ఆర్మీ ధృవీకరించింది.

తాజాగా పాకిస్తాన్‌ ప్రధాని షహెబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ అథారిటీ అనేది దేశ అణ్వాయుధ నిల్వలతో సహా భద్రతా నిర్ణయాలు తీసుకునే పౌర, సైనిక అధికారుల అత్యున్నత సంస్థ. ఈ వారంలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని పంపడం ద్వారా వారి వైమానిక సరిహద్దులను ఉల్లంఘించారని, కనీసం 48 మంది మరణించారని రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అణ్వాయుధాలను పర్యవేక్షించే అథారిటీతో పాక్‌ ప్రధాని సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. అయితే.. పాక్‌ బెదిరింపులకు పాల్పడుతుందని నిపుణులు అంటున్నారు.

మరోవైపు.. తాజాగా పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటన చేశారు. భారత్‌ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement