వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌  | Nobel prize 2025 Medicine Award winners | Sakshi
Sakshi News home page

వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ 

Oct 6 2025 3:31 PM | Updated on Oct 7 2025 5:52 AM

Nobel prize 2025 Medicine Award winners

రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకు విశిష్ట గుర్తింపు   

మేరీ ఈ.బ్రంకోవ్, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్, డాక్టర్‌ షికోమ్‌ సకాగుచీకి ఉమ్మడిగా బహుమతి  

నోబెల్‌ కమిటీ ప్రకటన  

స్టాక్‌హోమ్‌: వైద్య శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి 2025 సంవత్సరానికి గాను ముగ్గురు సైంటిస్టులను వరించింది. మనుషుల్లో రోగ నిరోధక వ్యవస్థపై విశిష్టమైన పరిశోధనలు చేసిన మేరీ ఈ.బ్రంకోవ్, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్, డాక్టర్‌ షికోమ్‌ సకాగుచీకి ఈ బహుమతి ఉమ్మడిగా అందజేయనున్నట్లు స్వీడన్‌లోని నోబెల్‌ కమిటీ సోమవారం ప్రకటించింది. మేరీ ఈ.బ్రంకోవ్, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌ అమెరికాకు చెందినవారు కాగా, షికోమ్‌ సకాగుచీ జపాన్‌ సైంటిస్టు. 

64 ఏళ్ల బ్రంకోవ్‌ ప్రస్తుతం సియాటెల్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సిస్టమ్స్‌ బయాలజీలో సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. రామ్స్‌డెల్‌(64) శాన్‌ ఫ్రాన్సిస్కోలో సోనోమా బయోథెరాపిటిక్స్‌కు శాస్త్రీయ సలహాదారుగా సేవలందిస్తున్నారు. 74 ఏళ్ల సకాగుచీ జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీకి సంబంధించిన ఇమ్యూనాలజీ ఫ్రాంటియర్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ప్రొఫె సర్‌గా వ్యవహరిస్తున్నారు. మనుషుల ఆరోగ్యానికి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అత్యంత కీలకం. ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు దాడి చేసినప్పుడు గుర్తించి, సమర్థంగా అడ్డుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. 

ఇదే రోగ నిరోధక వ్యవస్థ శరీరంలో సొంత కణాలపై దాడి చేయకుండా నియంత్రిత టీ–కణాలు(స్పెషల్‌ ఇమ్యూన్‌ సెల్స్‌) ఎలా కాపాడుతున్నాయో ముగ్గురు సైంటిస్టులు పరిశోధించి కనిపెట్టారు. అవి శరీరానికి సంరక్షకులుగా పని చేస్తున్న విధానాన్ని విడమర్చి చెప్పారు. రెగ్యులేటరీ టీ–సెల్స్‌ శక్తి సామర్థ్యాలను, రోగ నిరోధక వ్యవస్థను సమతూకంగా ఉంచడంలో వాటి ప్రాధాన్యతను ప్రపంచానికి వెల్లడించారు. ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు అవసరమైన కొత్త ఔషధాల తయారీకి వారి పరిశోధన దోహదపడుతోంది. అటోఇమ్యూన్‌ వ్యాధులు, క్యాన్సర్‌ చికిత్సల్లో మెరుగైన విధానాలకు మార్గం చూపింది. అవయవాల మారి్పడి ప్రక్రియ సైతం సులభతరం కానుంది. ఇమ్యూన్‌ టోలరెన్స్‌ను అర్థం చేసుకొనే విధానాన్ని ఈ పరిశోధన మార్చేసింది.  

నేడు భౌతికశాస్త్రంలో బహుమతి ప్రకటన  
ఈ ఏడాది మొదటి నోబెల్‌ బహుమతిని వైద్య శాస్త్రానికి ప్రకటించారు. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి విజేతల పేర్లను ప్రకటించబోతున్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ మెమోరియల్‌ ప్రైజ్‌ విజేతను ఈ నెల 13న ప్రకటిస్తారు. అ్రల్ఫెడ్‌ నోబెల్‌ వర్థంతి సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌ 10న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. వైద్య శాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్‌ పొందిన ముగ్గురు సైంటిస్టులకు ఉమ్మడిగా 1.2 మిలియన్‌ డాలర్లు (రూ.10.65 కోట్లకుపైగా) అందజేస్తారు. వారు ఆ సొమ్ము సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. విజేతలకు ఒక్కొక్కరికి 18 క్యారెట్ల బంగారు పతకం               లభిస్తుంది.  

ఏమిటీ టీ–కణాలు?    
టీ–కణాలు శరీరంలో తెల్లరక్త కణాల్లాంటివే. ఇమ్యూన్‌ సిస్టమ్‌లో ఒక భాగంగా ఉంటూ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంటాయి. ఎముక మజ్జలో పుట్టే టీ–కణాలు థైమస్‌లో వృద్ధి చెందుతాయి. రోగ నిరోధక వ్యవస్థ రకరకాల టీ–కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక పాత్ర ఉంటుంది. ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్‌లు, క్యాన్సర్‌ కణాలను గుర్తించి, నాశనం చేయడంలో ఇవి సైనికులుగా పనిచేస్తాయి. రక్షణ కవచంగా తోడ్పడుతాయి. ఇమ్యూన్‌ వ్యవస్థ పొరపాటున సొంత కణాలపై దాడి చేయకుండా రెగ్యులేటరీ టీ–కణాలు నిరోధిస్తాయి. అటోఇమ్యూనిటీని అడ్డుకుంటాయి. 

ఈ ప్రక్రియను పెరిఫెరల్‌ ఇమ్యూన్‌ టోలరెన్స్‌ అంటారు. ఒకవేళ టీ–కణాలు లేకపోతే సాధారణ రోగ నిరోధక వ్యవస్థ గతి తప్పుతుంది. ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి. ప్రాణాపాయం సంభవించవచ్చు. రెగ్యులేటరీ టీ–సెల్స్‌ను షిమోన్‌ సకాగుచీ 1995లో తొలిసారిగా గుర్తించారు. ఈ ప్రత్యేక కణాల వల్లే రోగ నిరోధక వ్యవస్థ ఒక క్రమపద్ధతిలో పని చేస్తున్నట్లు తేలి్చచెప్పారు. బ్రంకోవ్, రామ్స్‌డెల్‌ 2001లో ఈ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లారు. ఫాక్స్‌పీ3 అనే జన్యువును కనిపెట్టారు. రెగ్యులేటర్‌ టీ–సెల్స్‌ అభివృది్థలో ఈ జన్యువు పాత్ర కీలకమని గుర్తించారు. ఈ కణాల ఉత్పత్తి, పనితీరును ఫాక్స్‌పీ3 నియంత్రిస్తున్నట్లు నిరూపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement