అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరసన సెగ గట్టిగానే తగులుతోంది. ట్రంప్ పరిపాలనా విధానాలను తప్పుబడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలు ‘నో కింగ్స్ (No Kings) నిరసనలు చేపట్టారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా నిరసనలు చేపట్టారు. మిన్నెసోటాలోని కాలిపాట్ లాన్కు భారీగా నిరసన కారులు వీధులోకి వచ్చారు.
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలతో పాటు లండన్, పారిస్, రోమ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కలిపి 3,200 కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో జరిగిన రెండు 'నో కింగ్స్' ఈవెంట్లకు లక్షలాది మంది హాజరయ్యారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్-డే నిరసనగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.
గాయకులు బ్రూస్ స్ప్రింగ్స్టీన్, జోన్ బేజ్ మిన్నెసోటా స్టేట్ క్యాపిటల్ వద్ద ర్యాలీకి నాయకత్వం వహించనున్నారు. ఇక్కడ సుమారు లక్ష మంది మంది పాల్గొంటారని అంచనా. మిడ్టౌన్ మాన్హాటన్లో వేలాది మంది వీధులోకి చేరుకున్నారు. నటుడు రాబర్ట్ డి నీరో మాట్లాడుతూ.. గతంలో చాలామంది అధ్యక్షులు తమ రాజ్యాంగ పరిమితులను పరీక్షించారు, కానీ మన స్వేచ్ఛకు, భద్రతకు ఇంతటి ముప్పుగా ఎవరూ మారలేదంటూ వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్లోని నేషనల్ మాల్ వద్ద నిరసనకారులు ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ.. ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులను ప్రదర్శించారు. మేరీల్యాండ్లోని ఒక వృద్ధాశ్రమం బయట చక్రాల కుర్చీల్లో ఉన్న వృద్ధులు కూడా నిరంకుశత్వాన్ని ఎదిరించండి అంటూ బోర్డులతో నిరసన తెలిపారు. ఈ నిరసనలు.. ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయంటూ వైట్ హౌస్ కొట్టిపారేసింది.


