కాలువలోకి దూసుకెళ్లిన మినీబస్సు.. 22 మంది దుర్మరణం | More Than 20 Killed Minibus Falls Into Canal Egypt | Sakshi
Sakshi News home page

Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన మినీబస్సు.. 22 మంది దుర్మరణం

Nov 13 2022 3:31 AM | Updated on Nov 13 2022 3:39 AM

More Than 20 Killed Minibus Falls Into Canal Egypt - Sakshi

కైరో: ఈజిప్టు ఉత్తర డకాలియా ప్రావిన్స్‌ అగ పట్ణణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ మినీబస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 అంబులెన్సులను పంపి బాధితులను రెండు ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు.

ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు లక్ష ఈజిప్ట్ పౌండ్లను పరిహారంగా ప్రకటించింది ప్రభుత్వం.

ఈజిప్ట్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రహదారులు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2021లోనే 7,000 మందికిపైగా వివిధ ప్రమాదాల్లో చనిపోయారు.  గత నెలలో కూడా మినీబస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement