టెహ్రాన్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ(56) ప్రస్తుతం అపస్మారక స్థితికి చేరుకున్నారా? దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? నిజమేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఖోమ్ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలావరకు దిగజారినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అప్పటి సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తబా ఖమేనీ గాయాలపాలయ్యారు.
తర్వాత ఆయనను నూతన సుప్రీంలీడర్గా ఎంపిక చేశారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోందని యూఎస్–ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్కు సంబంధించిన కీలక నిర్ణయాల్లో మొజ్తబా ప్రమేయం ఉండడం లేదని వెల్లడించింది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు కచ్చితంగా తెలుసని స్పష్టంచేసింది. సుప్రీంలీడర్గా ఎంపికైన తర్వాత మొజ్తబా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజలకు కనిపించలేదు. మీడియా ద్వారా ప్రకటనలు మాత్రం ఇచ్చారు.


