టెహ్రాన్: కాల్పుల విరమణ వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఇది యుద్ధానికి ముగింపు కాదని, తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్పైనే ఉన్నాయని హెచ్చరించారు. సీజ్ఫైర్లో భాగంగా తక్షణమే కాల్పులు ఆపాలని చెప్పారు. శత్రుదేశాలు దురాక్రమణకు పాల్పడితే దీటుగా సమాధానం చెబుతామని అన్నారు. హార్మూజ్ను తెరిచేందుకు అంగీకరించామని చెప్పారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఖమేనీ ఈ ప్రకటన చేశారు. "ఇది యుద్ధానికి ముగింపు కాకపోయినప్పటికీ, అన్ని సైనిక విభాగాలు సుప్రీం లీడర్ ఆదేశాలను పాటించి కాల్పులు నిలిపివేయాలి" అని ఆ ప్రకటనలో ఉంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ ఏ విధమైన చర్యలకు పాల్పడినా తక్షణ ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రువు చిన్న తప్పు చేసినా పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తామని చెప్పింది.
అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణ రెండు వారాల పరిమిత కాలానికి మాత్రమే. ట్రంప్ దీన్ని "డబుల్ సైడెడ్ (ద్వైపాక్షిక) యుద్ధ విరమణ"గా వివరించారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఈ కాల్పుల విరమణను.. "యుద్ధం ముగిసిందన్న సూచనకాదు" అని స్పష్టం చేసింది. చర్చలు జరగేందుకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా వచ్చిన వ్యూహాత్మక విరామం అని తెలిపింది.


