టెహ్రాన్: ఇరాన్లోని జైలులో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహ్మదీ(53) ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. జన్జాన్ జైలులో ఉన్న ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు నర్గీస్ మహ్మదీ ఫౌండేషన్ బుధవారం ఎక్స్లో వెల్లడించింది. బరువు కోల్పోయారని, పాలిపోయి చాలా బలహీనంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 24వ తేదీన జైలులో గుండెపోటుకు గురయ్యారని, ఆమెను పరీక్షించిన వైద్యుడు తెలిపారని ఫౌండేషన్ వెల్లడించింది.
గుండెపోటుకు గురైన ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు గంటపాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. నర్గీస్ను గత నెలలో రెండు పర్యాయాలు కుటుంబసభ్యులు, లాయర్లు కలిసి మాట్లాడారని తెలిపింది. హక్కుల లాయర్ అయిన నర్గీస్కు 2023లో జైలులో ఉండగానే నోబెల్ కమిటీ శాంతి పురస్కారం ప్రకటించింది. ఇరాన్లోని మషాద్లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారన్న ఆరోపణలపై గతేడాది డిసెంబర్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.


