పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి. అమెరికాపై ఇరాన్ గురువారం ప్రతిదాడులకు దిగింది. హర్ముజ్ జలసంధి ప్రాంతంలోనే యూఎస్ బేస్లపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా నిర్వహించిన తాజా వైమానిక దాడులకు కౌంటర్గానే ఈ దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అవసరమైతే మరింత తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగిస్తామని కూడా హెచ్చరించింది. ఈ దాడిపై అమెరికా స్పందన.. జరిగిన నష్టం గురించి తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. అమెరికా కూడా ఇరాన్లోని సైనిక కేంద్రాలపై మరోసారి దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. హర్ముజ్లో వాణిజ్య నౌకలు, అమెరికా బలగాలకు ముప్పుగా మారే డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు.
మూడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం మధ్య ఈ తాజా పరిణామాలు చోటుచేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. హర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.


