గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. యూఏఈలో ఉన్న అమెరికా ప్రయోజనాలు, సైనిక స్థావరాలు, పోర్టులు భవిష్యత్ దాడుల్లో లక్ష్యాలుగా మారవచ్చని హెచ్చరించింది.
ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా సైన్యం వినియోగిస్తున్న ప్రదేశాలు “న్యాయమైన లక్ష్యాలు” కావచ్చని పేర్కొంది. అందువల్ల ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, కార్మికులు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది.
దాడులకు ముందు హెచ్చరిక
ఇరాన్ ప్రకారం యూఏఈలోని కింది ప్రాంతాలు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. అవి..
* ప్రధాన పోర్టులు, డాక్లు
* అమెరికా సైన్యం ఉపయోగించే స్థావరాలు
* అమెరికా ప్రయోజనాలు ఉన్న ఆయిల్ టర్మినల్స్
* వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రాలు
ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ సైన్యం సూచించింది.
ఫుజైరా పోర్ట్ వద్ద డ్రోన్ దాడి
ఈ ఉద్రిక్తతల మధ్య ఫుజైరా పోర్ట్ వద్ద డ్రోన్ దాడి జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ ఘటనతో అక్కడి ఆయిల్ లోడింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని ఆయిల్ నిల్వ ట్యాంకుల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించగా, భారీగా పొగలు ఎగసిపడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి.
ప్రపంచానికి కీలకమైన చమురు ఎగుమతి కేంద్రాలలో ఫుజైరా పోర్ట్ ఒకటి. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 10 లక్షల బ్యారెల్స్ చమురు ఎగుమతి అవుతుందని అంచనా.
ఉద్రిక్తతలకు కారణం ఇదే..
ఇటీవల అమెరికా సైన్యం ఇరాన్లోని కీలక ఆయిల్ టర్మినల్ అయిన ఖార్గ్ ద్వీఈపంపై దాడులు జరిపిందని వార్తలు వచ్చాయి. ఈ చర్యలకు ప్రతీకారంగానే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.


