అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రితో ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని అన్నారు. మళ్లీ ఎప్పటికీ పునరుద్దరించలేరని తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ఇరాన్.. ఓ సైకో తమని ఏం చేయాలేడని చెప్పింది. ఇప్పటికే చర్చల ప్రక్రియని పూర్తిగా నిలిపివేసింది.
'మా ఇంధన వనరులు, బ్రిడ్జిలపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రపంచ చమురు రవాణా మొత్తాన్ని అస్తవ్యస్తం చేస్తాం' అని ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. ఇకపోతే ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా నౌకలకు గేట్ వేగా ఉండే బాబ్ అల్ మండేబ్ మార్గాన్ని మూసేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ రూట్లో నిత్యం 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది.
ప్రపంచ చమురు వాణిజ్యంలో 12 శాతం ఈ మార్గంలోనే రవాణా జరుగుతుంది. ఒకవేళ ఇది మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా మరింత ఇంధన సంక్షోభం తలెత్తడం గ్యారంటీ. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూతపడగా.. ఇప్పుడు బాబ్ అల్ మండేబ్ మార్గాన్ని కూడా మూసేస్తే ఆఫ్రికా దేశాల చుట్టూ తిరిగి రావడానికి 14 రోజులు పడుతుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది.


